Friday 2 September 2016

దర్మేచ ,అర్దేచ ,కామేచ ,మోక్షేచ నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,మోక్షేచ నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు.
అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. అందరకు మాదిరే వివాహమ్ చేసుకున్నాడు. కొంత కాలం వారి కాపురం సజావుగా సాగిందనడానికి ఆనవాలుగా వారికి పిల్లలు కలిగారు. ఆ తర్వాత బార్యకి భర్త అంటే మొహం మొత్తింది కాబోలు, గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి పోయింది. పాపం ఆ భర్త పెద్ద మనుషుల ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్సాడు. అవ్వన్నీ విపలమయ్యాయి. చివరకు చేసేదేమి లేక, మరో మనువు ఊసెత్తకుండా, తన పిల్లలకు తల్లి, తండ్రి అన్నీ తానే అయి పెంచి పెద్ద చేసి విద్యా బుద్దులు చెప్పించాడు.అలా ఇరవై మూడేళ్లు గడిచాయి.
మొన్నీ మద్య ఆయనకి బార్య పుట్టింటి తరపు నుంచి కబురు వచ్చింది. ఆయన గారి బార్య చనిపోయిందని, చివరి చూపు చూడాలనుకుంటె రమ్మని పిలిచారట. ఆయన ఒక హిందూ భర్తగా తన ధర్మం ప్రకారం అత్తవారింటికి వెళ్ళి, తన భార్యను తన ఊరిలోనే దహన సంస్కారాలు నిర్వహించి, తన చేతితోనే కర్మ కాండ జర్పుతాను అని చెప్పేసరికి అత్తవారింటి వారు అవాక్కయారట!ఎప్పుడొ ఇరవై మూడేళ్ళ క్రితం కట్టుకున్న మొగుడిని, కన్న బిడ్డలను వదలి వచ్చేసిన ఆ భార్య కాలేని భార్య చనిపోతే ఆమె మీద ప్రేమతో కూడిన బాద్యతను నెరవేర్చడానికి తయారైన ఆ భర్తలోని ధర్మ పరాయణత్వం చూసి అబ్బుర పడ్డారు ఇరు గ్రామాల ప్రజలు. అందరి అంగీకారంతో ఆమెకు కర్మ కాండ పూర్తి చేసాడు ఆ భర్త.
తాళి కట్టిన దానితో కాపురం చేస్తూ, చిన్న ఇళ్ళ ఏర్పాటు కోసం వెంపర్లాడే మగ మహా రాజులు ఉన్న ప్రస్తుత సమాజంలో, పెండ్లి నాటి ప్రమాణానికి కట్టుబడి, ఒకే మాట,ఒకే భార్య అనే శ్రీ రాముని ధర్మాచరణాన్ని ఆచరించి చూపిన అతను నిజంగా ధన్యజీవి. చీటికి మాటికి కొట్లాడుకుంటూ, చిన్న చిన్న సమస్యలనే పెద్ద,పెద్ద బూతద్దాలలో చూస్తూ, విడాకులు తీసుకునే ఆలుమగలు ఒక మాట గుర్తుంచుకోవాలి మొట్ట మొదటగా ఎవరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి వివాహా మాడుతున్నారో వారితోనే జీవన సాపల్యం పొందడం గొప్ప అద్రుష్టం. వారి పిల్లలలొ ఉండె భద్రతాబావం, విడాకులు పొంది విడిగా ఉండే వారి పిల్లలో ఉండదు.

ఎవరికిష్టమైన జీవితం వారనుభవించే హక్కు భారత రాజ్యాంగం ప్రసాదించి ఉండవచ్చు .కానీ భార్యా భర్తలకు ఉండే స్వేచ్చాజీవిత హక్కుల కన్నా పిల్లల సహజ హక్కులైన తల్లితండ్రులతో కలసి ఉండడం అనేది ముఖ్యమైనది. కాబట్టి సాద్యమైనంతవరకు సర్దుకు పోయే గుణంతో సంసారాలను సాగించి పిల్లల సహజ హక్కును పరిరక్షించడం ప్రతి తల్లి ,తండ్రి కనీస ధర్మం . కాదని విడిపోయే వారి పిల్లలు అంత దురద్రుష్ట వంతులు ఈ లోకం లో ఎవరూ ఉండరు.పిల్లల మీద నిజంగా ప్రేమ ఉన్న వారైతే, ఆ పిల్లల తల్లి, లేక తండ్రి చేసే తప్పులను కూడా క్షమించే అంత సహనం కలిగి ఉంటారు. పై ఉదంతంలోని విషయమే తీసుకోండి. ఆ భర్త కి భార్యని భార్యగా చూడాల్సిన అవసరం లేనప్పటికి తన పిల్లలకు జన్మ నిచ్చిన తల్లిగా ఆమెను గౌరవించాడు. అ గుణమే ఆయనకు,అయన పిల్లలకు శ్రీ రామ రక్ష.