Thursday 10 September 2015

బ్యాంకాక్ బ్రహ్మ దేవాలయ విశేషాలు

bankak-1


థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని పాథుమ్‌ వాన్‌ జిల్లాలో ఈ ఎరవాన్‌ బ్రహ్మ దేవాలయం ఉంది. సుప్రసిద్ధ రాచప్రాసాంగ్‌ కూడలిలోని ఈ ఆలయాన్ని స్థానిక బౌద్ధులు, చైనీయులు, తూర్పు ఆసియా పర్యాటకులు తరుచుగా దర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. బ్యాంకాక్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఎరవాన్‌ శ్రైన్‌ ఆలయం కూడా ఒకటి. శ్రైన్‌ అంటే పుణ్య క్షేత్రమని అర్థం. ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని ‘ఫ్రా ఫోమ్‌’గా స్థానికులు పిలుస్తారు. నిత్యం ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆలయ ప్రాంగణంలో తరుచుగా థాయ్‌ నృత్యకారులు ప్రదర్శనలిస్తుంటారు. ఆలయానికి సమీపంలో ఫ్రా లక్ష్మి(లక్ష్మి), ఫ్రా త్రి మూర్తి(త్రి మూర్తి), ఫ్రా ఖానెట్‌(విఘ్నేశ్వరుడు), ఫ్రా ఇన్‌ (ఇంద్రుడు), ఫ్రా నరై సాంగ్‌ సుబాన్‌ (నారాయణుడు) విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. **బ్యాంకాక్‌ వీధుల్లో…. బ్రహ్మ దేవాలయ నిర్మాణం
ఈ ఆలయం నిర్మించడానికి అనేక కారణాలున్నాయి. నగర ఆధునీకరణతో బ్యాంకాక్‌ 1950 సంవత్సరంలో కొత్త రూపును సంతరించుకుంది. విదేశీయుల రాకపోకలు పెరిగాయి. దీంతో రాచప్రాసాంగ్‌ కూడలిలో ఓ హోటల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ హోటల్‌ నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు. కూలీలు గాయపడటం, ఆ కూడలిలో అనేక మంది రోడ్డు ప్రమాదంలో మరణించడం. ఇంకా అనేక విఘ్నాలు కలిగాయి. దాంతో ఆ హోటల్‌ యజమాని ఒక మతాధికారిని కలిశాడు. ఆయన సలహా ప్రకారం ‘బ్రహ్మ విగ్రహాన్ని’ హోటల్‌ ముందు ప్రాంగణంలో 1956 సంవత్సరం నవంబర్‌ 9న ప్రతిష్టించారు. హోటల్‌కు ‘ఎరవాన్‌’(ఇంద్రుని ఏనుగు పేరు) అనే పేరు పెట్టమని మతాధికారి సూచించారు. విగ్రహ ప్రతిష్ట జరిగాక ఎటువంటి ఆటంకాలు లేకుండా హోటల్‌ నిర్మాణం పూర్తయింది. బ్రహ్మ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత అక్కడి ప్రజలు పూజించడం మొదలుపెట్టారు. అందరిలోనూ బలమైన నమ్మకం ఏర్పడింది. దీంతో రాచప్రాసాంగ్‌ కూడలిలో అనేక దుకాణ సముదాయలు నిర్మించారు. అందరికి ఆ దేవునిపై నమ్మకం, భక్తి పెరిగాయి.
**కొలిచే వారికి కొంగు బంగారం…

థాయ్‌ ప్రజలు బ్రహ్మ దేవుణ్ని భక్తితో పూజించడంతో పాటు, కోరికలు కోరుకునేవారు. పెళ్లైన వారు.. పిల్లల్ని ప్రసాదించమని, పిల్లలు..పరీక్షల్లో పాస్‌ చేయించమని, ప్రేమికులు.. త్వరలో పెళ్లి జరగాలని, ప్రార్థించే వారు. వారి నమ్మకం ఫలించేది. ‘40 సంవత్సరాల క్రితం బ్రహ్మ దేవుణ్ని ఒక కోరిక కోరాను. అది నెరవేరింది’ అని హాంకాంగ్‌ నటి దేబోరహ్‌ లీ ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పడంతో ఆమె అభిమానులు అనేక మంది దేవుణ్ని దర్శించడానికి ఆలయానికి క్యూ కట్టారు.
**బ్రహ్మ విగ్రహం ధ్వంసం..

2006 సంవత్సరం మార్చి 21న ఒక ఉన్మత్తుడు బ్రహ్మ విగ్రహాన్ని సుత్తితో పగలకొట్టాడు. కొన్ని రోజులు ఆలయానికి భక్తులెవరని అనుమతింలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బ్రహ్మ దేవుడి ఫొటో పెట్టి పూజలు చేశారు. పాత విగ్రహ శకలాలకు, బంగారం, ఇత్తడి, వెండి, ఇతర విలువైన లోహాలు కలిపి ప్రస్తుత విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని 2006, మే 21న, సూర్యుని కిరణాలు విగ్రహం మీద నేరుగా పడే సమయం( 11.39 ఏ.ఎమ్‌)లో ప్రతిష్టించారు.